ఐపీఎల్: ముంబయి ఇవాళైనా బోణీ కొట్టేనా...?... టాస్ గెలిచిన ఢిల్లీ

ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ముంబయి వాంఖెడే స్టేడియంలో జరిగే  తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఇప్పటివరకు 3 మ్యాచ్ లు ఆడినా ఒక్క దాంట్లోనూ గెలవలేక ముంబయి జట్టు ఉసూరుమనిపిస్తోంది. ఐపీఎల్ లో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున్న జట్టు ముంబయి ఇండియన్సే. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి గెలుపు రుచి చూడాలని ముంబయి తహతహలాడుతోంది. 

అదే సమయంలో, ఢిల్లీ జట్టు పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ఆ జట్టు 4 మ్యాచ్ లు ఆడి మూడింట్లో ఓడిపోయింది. ఒక విధంగా నేటి మ్యాచ్ సమవుజ్జీల మధ్య పోరు అని చెప్పవచ్చు. 

ఇక ఈ మ్యాచ్ ద్వారా ముంబయి ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న సూర్యా భాయ్ కి తుది జట్టులో చోటు లభించింది. నమన్ ధీర్ స్థానంలో సూర్యాను ఎంపిక చేశారు. ఇక యువ పేసర్ ఎంఫాకా స్థానంలో రొమారియా... డివాల్డ్ బ్రెవిస్ స్థానంలో నబీ జట్టులోకి వచ్చారు. 

అటు, ఢిల్లీ జట్టులో రెండు మార్పులు జరిగాయి. జై రిచర్డ్సన్, లలిత్ యాదవ్ తుది జట్టుకు ఎంపికయ్యారు.

ఇరు జట్లలో గమనించదగ్గ ఆటగాళ్లు...

ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోట్జీ.

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషబ్ పంత్, ట్రిస్టాన్ స్టబ్స్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

IPL 2024
Double Header
Delhi Capitals
Mumbai Indians
Wankhede Stadium

More Telugu News